మంత్రులా? బందిపోటుదొంగలా?

దేవునిమీద ప్రమాణం చేసి భారతరాజ్యాంగానికి విధేయుడనై ఉంటానని,బధ్థుడనై ఉంటానని మంత్రిగా ప్రమాణం చేసిన మోపిదేవి,తన రాజీనామా పత్రంలో మాత్రం నాయకుడిని మరియు పార్టీని నమ్ముతూ నాటి ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు సంతకం పెట్టానని వ్రాశారు.ఈయన విధేయత రాజ్యాంగానికా,ఆనాటి ముఖ్యమంత్రికా?

రాజీనామా పత్రంలో ఇంకా ఏమని వ్రాశారో చూడండి."ఫైల్స్ నా కార్యాలమునకు రాకున్నను,వారి కార్యాలమునకు పిలిపించి వారి కార్యదర్శి సమక్షంలో సంతకం పెట్టడం జరిగింది.ఏదిఏమైనా నాయకుడి ఆదేశాలు పాటించాలికాబట్టి మంచి కోసమే సంతకాలు పెట్టడం జరిగింది".ఒక శాఖకు సంబంధించిన ఫైల్ ఆ శాఖ మంత్రిద్వారా ముఖ్యమంత్రికి వెళ్తుందా,లేక మన మంత్రిగారు సిగ్గు, లజ్జ లేకుండా ఒప్పుకొన్నట్లు నేరుగా ముఖ్యమంత్రి పేషీలో కార్యదర్శి చెప్పినచోట మంత్రి సంతకం పెడతాడా?

భారతరాజ్యాంగం ప్రకారం,చట్టబధ్థంగా అందరికీ సమన్యాయం చేస్తానని,భయ రాగద్వేషాలకతీతంగా నిర్ణయాలు తీసుకుంటానని ప్రమాణం చేసి తద్విరుధ్థంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ,చట్టవిరుధ్థమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల సొమ్ము లూటీ చేయడమా?అన్ని పాలనా నియమాలను తుంగలో తొక్కి రాశేరె మరియు ఆయన మంత్రివర్గం చేసిన నిర్వాకం నివ్వెరపరుస్తోంది.అది సచివాలయమా లేక దొంగల ముఠానాయకుడి గుహా? ఇంత జరిగినా ఈయనతోబాటు రాజ్యాంగానికి బధ్థులమౌతామని ప్రమాణాలు చేసిన సహచరమంత్రులు ఈయనకు బాసటగా నిలుస్తామని ప్రకటించడం కొసమెరుపు.

వీళ్ళు రాజ్యాంగానికి బధ్థులైన ప్రజాసేవకులా లేక బందిపోటు దొంగలా?